తమిళనాడు అసెంబ్లీలో రచ్చరచ్చ చేసిన డీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ ధనపాల్ సస్పెండ్ చేశారు. అయినప్పటికీ, వారు సభ నుంచి బయటకు వెళ్లడం లేదు. దీంతో వారిని బయటకు తీసుకెళ్లడంలో మార్షల్స్ కూడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తమపై సస్పెన్షన్ విధించినందుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు సభలో ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు కూడా సభలోకి వెళ్లారు. వారితో పాటే సభలో బైఠాయించి నిరసన వ్యక్తంచేస్తున్నారు.
దీంతో తమిళనాడు అసెంబ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రభుత్వం శనివారం విశ్వాస పరీక్ష కోసం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభమైన వెంటనే పన్నీర్ వర్గం, డీఎంకే సభ్యులు సీక్రెట్ ఓటింగ్కు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ నిరాకరించడంతో డీఎంకే సభ్యులు కొందరు ఏకంగా స్పీకర్ చొక్కా పట్టి లాగి, ఆయన కుర్చీలో కూడా కూర్చున్నారు.
ఈ నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్. ఈ క్రమంలో, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ను స్పీకర్ చర్చకు ఆహ్వానించారు. ఈ చర్చ సందర్భంగా కూడా రహస్య ఓటింగ్ జరపాల్సిందేనంటూ స్టాలిన్ పట్టుబట్టారు. దీంతో, ఓటింగ్ ప్రక్రియ మరింత గందరగోళంగా మారింది.