జయలలిత సమాధిపై శశి కసిగా కొట్టిన దెబ్బ సాక్షిగా బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ తన పంతాన్ని నెగ్గించుకుంది. రాబోయే నాలుగున్నరేళ్ల కాలం అంతా 'చిన్న'అమ్మ కనుసన్నల్లోనే పాలన సాగనుంది. ఎలాగూ మూడున్నరేళ్లలో జైలు నుంచి శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని బయటపడుతారు కనుక మిగిలిన ఒక సంవత్సరమంతా ఆమె తన ఇంటి దగ్గర నుంచి పాలన సాగించే అవకాశం ఉంది.
మరోవైపు జయలలిత చరిష్మాతో నిలబడిన అన్నాడీఎంకే పార్టీని శశికళ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం ఆరోపిస్తోంది. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామనీ, అసలు అన్నాడీఎంకే జాతీయ కార్యదర్శి పదవికి శశికళ ఎంపిక కూడా చట్టబద్ధం కాదనీ, ఆ ప్రకారంగా చూసినప్పుడు ఆమె ఎంపిక చేసిన పళని స్వామి కూడా అనర్హుడంటూ వారు వాదిస్తున్నారు. పదవి స్వీకరించగానే సరిపోదనీ, ఆయన ప్రభుత్వం మనజాలదనీ, గవర్నర్ బలనిరూపణ లోపే ఆ ప్రభుత్వం కూలిపోతుందని వారు అంటున్నారు. శశికళ ఆదేశాలపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరి దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.