'ముగింపునకు నాంది' .. బీజేపీకి పతనం ప్రారంభం : మమతా బెనర్జీ

బుధవారం, 14 మార్చి 2018 (15:48 IST)
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ ఫలితాల సరళి ప్రత్యర్థి పార్టీలైన ఎస్పీ, ఆర్జేడీలకు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాల సరళిపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫుల్పూరు లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు ఓవైపు వెలువడుతుండగానే సమాజ్‌వాదీ పార్టీ సంబరాలు జరుపుకొంటోంది. మరోవైపు ఈ రెండు నియాజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు రౌండురౌండుకూ ఆధిక్యత చాటుకుంటూ విజయం దిశగా దూసుకెళుతున్నారు. 
 
యూపీ ఉపఎన్నికల ఫలితాలతో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్‌పీ 'గ్రేట్ విక్టరీ' సాధించాయన్నారు. మాయవతి, అఖిలేష్ యాదవ్‌కు ఆమె అభినందనలు తెలిపారు. ఇది 'ముగింపునకు నాంది' అంటూ మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు