ఆవు పేరు చెబితే కొందరికి భయం.. మోదీ

గురువారం, 12 సెప్టెంబరు 2019 (07:54 IST)
‘‘ఈ దేశంలో ఆవు పేరు చెబితే కొందరికి భయం. వారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఓం శబ్దాన్ని ఉచ్చరించినా అంతే. దేశం 16 శతాబ్దిలోకి జారిపోయినట్లు భావిస్తారు. ఇది చాలా దురదృష్టకరం. అసలు పశువులు లేకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉంటుందా? భారత ఆర్థి క వ్యవస్థలో పశుపక్ష్యాదులు, వృక్ష జాతులు అంతర్భాగం. ప్రకృతిని, ఆర్థిక ప్రగతిని సమతూకం చేస్తేనే మనం దేశాన్ని బలోపేతం చేయగలం’’ అని ప్రధాని మోదీ అన్నారు.

‘శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆరాధ్యుడే కాదు.. ప్రకృతి ప్రేమించడంలో ఓ ప్రేరణ కూడా! బ్రజ్‌భూమి ప్రపంచం మొత్తానికి, మానవాళికి ప్రేరణ. ప్రకృతిని సంరక్షించడం ఎలానో భగవానుడి ద్వారా తెలుసుకోవచ్చు’’ అన్నారాయన. జాతీయ పశు వ్యాధి నిరోధక పథకం కింద -ఫుట్‌ అండ్‌ మౌత్‌ వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ఆయన మథురలో ప్రారంభించారు.

దాదాపు 50 కోట్ల ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులకు ఈ వ్యాధి నిరోధక ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ కార్యక్రమానికి రూ.12652 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వాడొద్దని కూడా ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. ఇష్టానుసారం ప్లాస్టిక్‌ వాడకం వల్ల పర్యావరణానికి, పశువులకు ఎంతో హాని జరుగుతోందన్నారు.

ఉగ్రవాద మూలాలు పొరుగుదేశంలోనే ఉన్నాయని ప్రధాని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి అన్నారు. ‘ ఏ సవాలు ఎదురైనా ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉన్నాం. గతంలో మన సన్నద్ధత ను నిరూపించాం. భవిష్యత్‌లోనూ ప్రదర్శించగలం’ అని ఆయన స్పష్టం చేశారు.

‘ఈ రోజు సెప్టెంబరు 11. 18 ఏళ్ల కిందట అమెరికాపై ఉగ్రదాడులు జరిగిన రోజు. ఉగ్రవాదం కొన్ని దేశాలకు ఓ సిద్ధాంతంగా మారింది. మన పొరుగుదేశం కూడా అందులో ఒకటి. ప్రపంచానికి ముప్పుగా వాటిల్లిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలూ కంకణబద్ధం కావాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబరు 11నాడే వివేకానందుడు షికాగో నగరంలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పాడని ఆయన గుర్తుచేశారు.
 
ఒవైసీ కౌంటర్‌
ప్రధాని వ్యాఖ్యకు ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ కౌంటర్‌ ఇచ్చా రు. ‘‘హిందూ సోదరులకు గోవు పవిత్రమైనదే. కానీ రాజ్యాంగం మనుషులందరికీ జీవించే హక్కు, సమానత్వపు హక్కు కల్పించింది. మోదీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని ఒవైసీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు