మూడేళ్ల బాలునిపై ట్యూటర్ పైశాచికం.. కాలితో తంతూ..!

గురువారం, 24 జులై 2014 (11:45 IST)
మూడేళ్ల బాలుని పట్ల ట్యూటర్ పైశాచికంగా ప్రవర్తించింది. మానవత్వం మరిచిపోయి మూడేళ్ల బాలుడిని విచక్షణారహితంగా కొట్టింది. కాలితో తంతూ.. ఆ బిడ్డ బాధ తాళలేక కేకలు పెట్టినా పట్టించుకోలేదు. మూడేళ్ల చిన్నారిని కనికరం లేకుండా చితకబాది చిత్రహింసలు పెట్టిన ఘటన బుధవారం కోల్‍కతాలో వెలుగు చూసింది. 
 
లేక్ టౌన్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీ వల్ల బుధవారం తల్లిదండ్రులకు తెలిసింది. పిల్లాడిని పై నుండి ఎత్తి కింద పడేసి దారుణంగా కొట్టింది. చిత్రహింసలకు గురిచేసింది. దీనిపై ట్యూటర్‌ని నిలదీయగా కాళ్లా వేళ్లా పడి పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని వేడుకుంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విడిచిపెట్టారు. 
 
కానీ ట్యూటర్ భర్త తిరిగి బాధితుల ఇంటికే వచ్చి తన భార్యపై ఫిర్యాదు చేస్తే అంతుచూస్తా అంటూ బెదిరించడంతో బాలుని తల్లిదండ్రులు ట్యూటర్‌పై లేక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ ఇంఛార్జి అశోక్ సేన్ తెలిపారు. కాగా ట్యూటర్ పరారీలో ఉందని, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి