మరికొద్దిసేపట్లో తమిళనాడు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి సర్కారు బలనిరూపణ పరీక్ష ఎదుర్కోనుంది. దీంతో కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఆయన వర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు. మొత్తం 35 వాహనాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వారు బయలుదేరారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను మొత్తం మూడు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపు బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించారు.
అయితే చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో సదరు ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ వారిని అడ్డుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు కె.పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నినాదాలు చేసి, గందరగోళం సృష్టించారు. వారిపై దాడికి యత్నించారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.