విమానం నడుపుతూ అలాగే నిద్రపోయే పైలట్ల గురించి విన్నా. అధికారులతో చిన్న పాటి గొడవలు పెట్టుకుని డ్యూటీకి రాకుండా చెక్కేసి ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పైలట్లనూ చూశాం. ఎవడిమీద కోపాన్నో విమానం మీదికి మళ్లించి నడుపుతున్న విమానాన్ని అలాగే హైజాక్ చేసి సముద్రంలో ముంచేసిన పైలట్లనూ చూశాం. కాని అడలేక మద్దెలోడు అన్నట్లుగా తనలో లోపం పెట్టుకుని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి ఇవ్వలేదు ఎలా విమానం నడిపేది అంటూ జాప్యం చేసిన పైలట్లు కూడా ఉన్నారని ఇప్పుడే తెలుస్తోంది.
చెన్నై నుంచి మదురై మార్గంలో వెళ్లాల్సిన 6ఇ-859 విమానం 11.45కి బయల్దేరాల్సి ఉండగా, దాన్ని 12.25కి రీషెడ్యూల్ చేశారు. ఆ విషయమై ప్రయాణికులకు ఎస్ఎంఎస్లు పంపారు. విమాన డిపార్చర్కు ఏటీసీ నుంచి అనుమతి రాలేదని పైలట్ తెలిపాడు. అయితే.. ప్రయాణికుల్లో ఒక ఏటీసీ అధికారి కూడా ఉన్న విషయం సదరు పైలట్కు తెలియదు. ఆయన వెంటనే చెన్నై ఏటీసీకి ఫోన్ చేసి విషయం ఏంటని అడిగారు. కానీ, వాళ్లు అసలు తమవైపు నుంచి సమస్య ఏమీ లేదని చెప్పడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.