గుజరాత్‌లో మందుపార్టీ... హైదరాబాదీ యువతితో పాటు 12 మంది అరెస్టు

బుధవారం, 24 జూన్ 2020 (09:52 IST)
దేశంలో సంపూర్ణ మద్య నిషేధం ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. అయితే, ఇటీవల కొందరు జూనియర్ వైద్యులు కలిసి వడోదరలో మందు పార్టీ చేసుకున్నారు. వీరిలో ఓ హైదరాబాద్ అమ్మాయితో పాటు మొత్తం ఐదుగురు అమ్మాయిలు పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జూనియర్ వైద్యులు, అమ్మాయిలతో పాటు... 12 మందిని అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సుమన్‌దీన్ విద్యాపీఠ్‌తోపాటు దీని అనుబంధ వైద్యశాల సుమన్‌దీప్ ఆస్పత్రిలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు చదువుకుంటున్నారు. 
 
గుజరాత్‌లోని మీన్‌నగర్ ప్రాంతానికి చెందిన జైన్ మెహతా, ఘట్లోడియాకు చెందిన కిరణ్ మెహతాలు జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి తన సహచరులైన మరో 10 మందితో కలిసి ఆమోదర్ గ్రామంలోని శ్యామల్ కౌంటీలో మందు పార్టీ చేసుకున్నారు. 
 
ఈ బృందంలో ఐదుగురు యువతులు కూడా ఉన్నారు. వారు మద్యం తాగుతున్నట్టు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వడోదరా రూరల్ పోలీసులు మొత్తం 12 మందినీ అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ఘటనా స్థలం నుంచి స్వదేశీ, విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌‌కు చెందిన వారితో పాటు హైదరాబాద్‌కు చెందిన జూనియర్‌ డాక్టర్‌ కోషి జోసెఫ్‌ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన 12 మందినీ ఆ తర్వాత స్టేషను బెయిలుపై విడుదల చేసినట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు