భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ సరిహద్దులను మూసివేయాలని భారత్ భావిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల జైసల్మేర్ పర్యటనలో భాగంగా బీఎస్ఎఫ్ (ఉత్తర) కార్యాలయంలో జరిగే కీలక సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ఇందులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్లు కూడా ఈ సమావేశానికి హాజరై, పాకిస్థాన్తో అన్ని రకాల బంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకునే విషయమై చర్చించనున్నారు.
వీరితోపాటు బీఎస్ఎఫ్ అధికారులు, పాక్తో సరిహద్దులను పంచుకుంటున్న రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మొత్తం 2,289.66 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా, అందులో 2,034.96 కిలోమీటర్ల మేరకు ఫెన్సింగ్ ఉంది. మిగిలిన 254.80 కిలోమీటర్ల ప్రాంతంలోనూ సరిహద్దును మూసివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇక్కడ చర్చించనున్నారని అధికారులు తెలిపారు.