యూపీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీ మనవడు

మంగళవారం, 11 జులై 2017 (13:47 IST)
యూపీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పేరును ఖరారైంది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సారథ్యంలో మంగళవారం జరిగిన యూపీఏ మిత్రపక్షాల భేటీ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ మనవడి పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టినట్టయింది. 
 
వచ్చే నెల ఐదో తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో యూపీఏ కూటమి తరపున అభ్యర్థి ఎంపిక కోసం మంగళవారం ఉదయం నుంచి పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన 17 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. జేడీయూ మాత్రం డుమ్మాకొట్టింది. ఈ సమావేశంలో గోపాలకృష్ణ గాంధీ పేరును ఏకగ్రీవంగా నిర్ణయించాయి. 
 
మహాత్మా గాంధీ మనవడిగా, పశ్చిమ బెంగాల్ బెంగాల్ మాజీ గవర్నర్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా గోపాలకృష్ణ గాంధీ సుపరిచితులు. గాంధీ చిన్న కుమారుడైన దేవదాస్ గాంధీ కుమారుడే గోపాలకృష్ణ గాంధీ. ఏప్రిల్ 22, 1945లో జన్మించిన ఆయన, 1968లో ఐఏఎస్ ఉత్తీర్ణులయ్యారు. ఆపై వివిధ విభాగాల్లో పదవులను అలంకరించారు. 
 
ఆయనకు భార్య తారా గాంధీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1985 నుంచి 87 మధ్య ఉపరాష్ట్రపతికి కార్యదర్శిగా, ఆపై 1992 వరకూ రాష్ట్రపతికి సంయుక్త కార్యదర్శిగానూ పనిచేశారు. మంచి విద్యావేత్త. దౌత్యవేత్త. వివాదరహితుడు. ఈయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్‌గా కూడా పని చేశారు. 
 
కాగా, గోపాలకృష్ణ గాంధీ పేరును అధికారికంగా యూపీఏ ప్రకటించడం వెనుక, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయేను ఇరుకున పెట్టాలన్న వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. గాంధీ కుటుంబంలోని వ్యక్తిని తెరపైకి తేవడం ద్వారా మోడీని ఇబ్బంది పెట్టాలన్న కాంగ్రెస్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి