హిందీలో ట్రంప్ ట్వీట్.. సబర్మతీ ఆశ్రమంలో అల్పాహారం..

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (11:13 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారు. వచ్చేస్తున్నానంటూ హిందీలో ట్వీట్ చేసి అబ్బురపరిచారు. తాము భారతదేశంలో అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్నామని.. దారిలో వున్నామని.. కొన్ని గంటల్లో అందరినీ కలుస్తామని ట్వీట్ చేశారు.

ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ కూడా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వారికి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
 
ఇకపోతే.. అహ్మదాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే ట్రంప్, అక్కడి నుంచి నరేంద్ర మోదీతో కలిసి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొతేరా స్టేడియానికి చేరుకుంటారు. మార్గ మధ్యంలో మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తారు. ఈ సందర్భంగా ట్రంప్, అక్కడే అల్పాహారాన్ని స్వీకరించనున్నారు.
 
అది గాంధీ ఆశ్రమం కాబట్టి, పూర్తి శాకాహార వంటకాలనే ట్రంప్‌కు వడ్డించనున్నారు. ఇక మెనూలో ఫేమస్ గుజరాతీ వంటకాలైన కాజూ కట్లీ, కార్న్ సమోసా, బ్రకోలీ సమోసా, ఖమన్, ఆపిల్ ఫ్రై తదితరాలను ట్రంప్, మెలానియా స్వీకరిస్తారని, వీరికోసం పలురకాల పండ్ల రసాలను సిద్ధం చేశామని సబర్మతీ ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు.
 
కాగా, కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ట్రంప్ సబర్మతీ ఆశ్రమంలో గడుపుతారు. గాంధీ వాడిన పలు వస్తువులను ఆయన సందర్శించనున్నారు. ఆయన గదిని, అక్కడి నుంచి నర్మదా నదిని తిలకించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు