కర్నాటక కేడర్ ఐఏఎస్ అధికారి సూసైడ్.. కర్ణాటక మంత్రి ఉమశ్రీనే కారణమా?

బుధవారం, 17 మే 2017 (15:35 IST)
కర్నాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఆయన అనుమానాస్పదంగా మరణించారు. ఈయన బలవన్మరణానికి కర్నాటక మంత్రి ఉమశ్రీతో ఉన్న గొడవలే ఓ కారణంగా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఆ అధికారి పేరు అనురాగ్ తివారీ. వయసు 35 యేళ్ళు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహర్చి అనురాగ్‌ సొంతూరు. తివారి 2007లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. అతను జూన్, 2015లో బీదర్ డీసీలో పోస్టింగ్ పొందారు. మధుగిరి అసిస్టెంట్ కమిషనర్‌గా, కొడగు డిప్యూటీ కమిషనర్‌గా, బెంగళూరులో డిప్యూటీ సెక్రటరీ(ఫైనాన్స్)గా పనిచేశారాయన. 
 
ఈ పరిస్థితుల్లో ఈయన మృతదేహాన్ని బుధవారం ఉదయం లక్నోలోని హజ్రత్‌గంజ్‌ ఏరియాలో పోలీసులు గుర్తించారు. మీరాబాయి అతిథిగృహానికి సమీపంలో రహదారి పక్కన అనురాగ్‌ మృతదేహం, అతనికి సంబంధించిన వస్తువులు పడివున్నాయి. మృతదేహానికి దవడ వద్ద గాయం ఉన్నట్లు గుర్తించారు. తివారీ గత రెండు రోజులుగా మీరాబాయి అతిథి గృహంలో బస చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మృత్యువాతపడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా, కర్నాటక మంత్రి ఉమశ్రీతో 2015లో తివారికీ ఓ వివాదం ఉంది. రైతుల నిరసనల నేపథ్యంలో మంత్రి ఉమశ్రీ.. తివారిని బయటికి లాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పుడు సంచలనంగా మారింది. అప్పటినుంచి వీరి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. 

వెబ్దునియా పై చదవండి