దొంగనైతే పట్టుకున్నాడు.. కానీ ఆ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా!

గురువారం, 16 ఏప్రియల్ 2020 (23:03 IST)
దొంగను పట్టుకున్నాడు.. కానీ ఆ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. కారణం దొంగకు కరోనా వుందని పరీక్షల్లో తేలింది. దీంతో పరుగు పరుగున హెడ్ కానిస్టేబుల్‌తో పాటు పోలీస్ స్టేషన్‌లోని నలుగురు కానిస్టేబుళ్లను కూడా హోమ్ క్వారంటైన్‌కు పంపారు.

అలాగే ఆ దొంగ నివసిస్తున్న ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా సీల్ చేశారు. ఆ ప్రాంతంలో మొత్తం 150 భవనాల్లో 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న మరో 7 కాలనీలను కూడా పోలీసులు బఫర్ జోన్‌లుగా ప్రకటించారు. ఈ ఘటన వడోదరాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, వడోదరలోని దభోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రొవిజన్ స్టోర్ లో రూ.4,265 విలువగల పాన్ మసాలా చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు చేశారు.

అయితే వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమై వారిని అరెస్టు చేసి తీసుకొచ్చిన పోలీసులను కూడా కరోనా పరీక్షలకు పంపారు. వారిలో హెడ్ కానిస్టేబుల్ కి మాత్రం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మరో నలుగురు పోలీసులను హోం క్వారంటైన్‌కు పంపారు. 
 
ఈ ఘటనపై జిల్లా ప్రధాన వైద్యాధికారి ఉదయ్ తిలావత్ స్పందిస్తూ, పోలీసులు అరెస్టు చేసిన దొంగకు కరోనా పాజిటివ్ రావడంతో, దాదాపు 12 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపాం. వారిలో 11 మందికి నెగెటివ్ రాగా ఒక్కరికి పాజిటివ్ వచ్చింది. ఈ కేసులో దొంగకు కరోనా ఎలా సోకిందనే విషయంపై విచారణ జరుపుతున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు