దేశం కోసం ప్రాణాలు అర్పించిన మానసికి శౌర్యపతకం

సోమవారం, 15 ఆగస్టు 2016 (09:30 IST)
భారత మిలిటరీ చరిత్రలోనే మొదటిసారిగా మరణించిన శునకానికి వీరగౌరవం దక్కింది. శత్రువును పసిగట్టి వారిని అణిచే క్రమంలో ప్రాణాలు అర్పించిన సాహస శునకానికి శౌర్యపతకం లభించింది. మరణానంతరం ఈ గౌరవం దక్కిన తొలి శునకం పేరు మానసి. ''మానసి'' ఆర్మీకి చెందిన ట్రాకర్ డాగ్ యూనిట్‌లో ఓ శునకం. ఉత్తర కశ్మీర్లో టెర్రరిస్టుల చొరబాట్లను పసిగట్టి సైన్యానికి సమాచారం అందించేందుకు ''160 ప్రాదేశిక సైన్యం'' డాగ్‌ స్క్వాడ్‌ను ఉపయోగించుకోవడం అలవాటు.
 
ఈ స్క్వాడ్‌లోనే నాలుగేళ్ల వయస్సున్న మానసి, దాని సంరక్షకుడు బషీర్‌ అహ్మద్‌ వార్‌ పనిచేస్తున్నారు. ముగ్గురు టెర్రరిస్టుల చొరబాటును నిరోధించి వారిని మట్టుబెట్టిన చరిత్ర మానసి, బషీర్‌లకు ఉంది. గతేడాది జూలై 21న తంగధర్ సరిహద్దు వద్ద భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన మానసి, బషీర్‌లు వారిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో విఫలమయ్యారు.

ముష్కురుల తూటాలకు బలయ్యారు. చొరబాటుదార్లను అడ్డుకునేందుకు తమ వంతు కృషి చేసి ప్రాణాలు అర్పించిన ''మానసి''ని ''మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్'' సర్టిఫికెట్‌తో ఆదివారం సైన్యం సత్కరించింది. అలాగే సంరక్షకుడు బషీర్‌కు సేనా మెడల్‌ లభించింది. ''మానసి'' పేరు‌ను త్వరలో గెజిట్‌లోకి ఎక్కించనున్నట్టు రక్షణ శాఖ ప్రతినిధి ఎస్‌డీ గోస్వామి వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి