లక్నోలో విశ్వహిందూ మహాసభ నేత దారుణ హత్య

ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (12:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో విశ్వహిందూ మహాసభ నేత దారుణహత్యకు గురయ్యారు. ఆయన పేరు రంజిత్ బచ్చన్. ఈయన విశ్వహిందూ మహాసభకు చీఫ్‌గా ఉన్నారు. లక్నోలోని హజరత్‌ గంజ్‌‌లో ఉదయం మార్నింగ్ వాక్‌కు రంజిత్ వెళ్లిన వేళ ఈ దారుణం జరిగింది. 
 
తన సోదరుడితో కలిసి ఆయన వాకింగ్ చేస్తుండగా, దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రంజిత్ తలలోకి బుల్లెట్ దిగడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. ఆయన సోదరుడిని ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన లక్నోలో తీవ్ర కలకలం రేపింది. యూపీలో బీజేపీ అధికారంలో ఉన్న వియం తెల్సిందే. అలాంటి రాష్ట్రంలో హిందూ మహాసభ నేత హత్యకు గురికావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, నిందితుల ఆచూకీ కోసం ఆరు ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తామని అన్నారు. ఇటీవలి కాలంలో యూపీలో హిందుత్వ ప్రతినిధులను కాల్చిచంపిన ఘటనల్లో ఇది రెండవది కావడం గమనార్హం. 2019 అక్టోబర్‌ లో హిందూ సమాజ్‌పార్టీ నాయకుడు కమలేశ్‌ తివారీని కాల్చి చంపిన ఘటన తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు