ఢిల్లీ లిక్కర్ స్కామ్‍లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారు?

ఠాగూర్

శుక్రవారం, 22 మార్చి 2024 (08:34 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ఆయనను ఎందుకు అరెస్టు చేశామో వివరిస్తూ ఈడీ అధికారులు ఓ నోట్ విడుదల చేశారు. ఢిల్లీలో కొత్త మద్యం విధానం (న్యూ ఎక్సైజ్ పాలసీ) రూపకల్పనలో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారుడు అని స్పష్టంగా పేర్కొంది. భారత రాష్ట్ర సమితి మహిళా నేత కల్వకుంట్ల కవిత, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌‍లతో కలిసి భారీ కుట్రకు తెరతీశారని పేర్కొంది. 
 
ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా సౌత్ లాబీకి భారీగా లబ్ధి చేకూరిందని తెలిపింది. అందుకు ప్రతీకగా ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ లాభీ రూ.100 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చిందని వెల్లడించింది. ఈ కేసు విచారణ క్రమంలో పలువురు నిందితులు, సాక్షులు ఇచ్చిన తమ వాంగ్మూలాల్లో అరవింద్ కేజ్రీవాల్‌ పేరును చెప్పారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టు, చార్జిషీట్లలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, లిక్కర్ పాలసీ కేసు నిందితుడు అయిన విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి తరచుగా వెళుతూ, ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని పేర్కొన్నారు. అలాగే, లిక్కర్ పాలసీ గురించి కేజ్రీవాల్‌‍తో చర్చించామని మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పారని అధికారులు పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను కలవడానికి ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రను విజయ్ నాయర్ పంపారని తెలిపారు. 
 
ఆ తర్వాత మరోసారి ముగ్గురు కలిసి వీడియో కాల్ మాట్లాడారని వివరించారు. తను విశ్వసించే వారిలో నాయర్ ఒకరని మహేంద్రతో అరవింద్ కేజ్రీవాల్ అన్నారని ఈడీ అధికారులు చెబుతున్నారు. సౌత్ లాబీలో తొలి నిందితుడు రాఘవ్ మాగుంట సాక్షిగా మారిన విషయం తెల్సిందే. రాఘవ్ తండ్రి, ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసినట్టు ఈడీ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు