నిశ్చితార్థం చేసుకున్న యువకుడి నుంచి వాట్సప్ కాల్, అంతే... గొంతు నులిమేసాడు

శుక్రవారం, 6 నవంబరు 2020 (22:34 IST)
ఇద్దరి మనసులు కలిశాయి. దాంతో విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లకుండానే యువతిని పెళ్లి చేసుకున్నాడతను. పైగా ఆమెను గోప్యంగా వేరేచోటకి తరలించి కాపురం చేసాడు. అలా మూడు నెలలు గడిచింది. ఓ రోజు ఆమెకి వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ కాల్ చూసి ఆగ్రహం చెంది ప్రేమించి పెళ్లాడిన భార్య గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నేరుగా వెళ్లి పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిధిలో నివాసం వుంటున్న అన్షుకి లాక్ డౌన్ సమయంలో సచిన్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఐతే కుటుంబ సమస్యల కారణంగా ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత అన్షు మరో యువకుడు హర్షతో ప్రేమలో పడింది. వీళ్లద్దరూ ఒకే చోట పనిచేసేవారు. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.
 
దాంతో ఆమె మెడలో మూడుముళ్లు వేసి మూడు నెలల క్రితం కలిసి జీవించడం ప్రారంభించారు. ఎవరికీ చెప్పకుండా ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అన్షు తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా అతడితో సంతోషంగా జీవించడానికి వచ్చేసింది. తమ కుమార్తె అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి తప్పిపోయిందంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేసారు.
 
ఆమె ఆచూకి తెలుసుకునేలోపే అక్టోబరు 27 రాత్రి హర్ష తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య అన్షును గొంతు నులిమి హతమార్చడం సంచలనంగా మారింది. తన భార్యను తనే హత్య చేసానంటూ అతడు పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. కాగా తమ కుమార్తె మరణవార్త విని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. హర్ష ఓ రాజకీయ నాయకుడి మద్దతు వున్నట్లు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు