దీపలో అమ్మ రక్తం ఉంది.. ఓకే అంటే రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తా: ఓపీ

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (13:19 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత రక్తమే ఆమె మేనకోడలు దీపలోనూ వుందని.. ఆమె ఓకే అంటే రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తానని పన్నీర్ సెల్వం అన్నారు. పన్నీర్ సెల్వం వ్యాఖ్యలతో దీప వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వెంటనే శాసనసభను ఏర్పాటు చేస్తే పార్టీని ఏకతాటిపై నిలిపేవారెవరో తేలిపోతుందని పన్నీర్ సెల్వం అన్నారు. పార్టీ చీలిపోతుందన్న భయం తనకు ఏమీలేదని, తప్పుడు ప్రచారాలు ఆపాలని శశికళ వర్గానికి చురకలు వేశారు పన్నీర్ సెల్వం.  
 
ఇప్పటికే తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు బుధవారం చెన్నైలోని టీ. నగర్ లోని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇంటికి వెళ్లి చర్చించారు. శశికళపై తిరుగుబాటు చేసిన సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వాలని దీపాకు మనవి చేశారు. తాను తమిళనాడులోని అన్ని జిల్లాల్లో పర్యటించి ఎవరు సీఎంగా ఉండాలో అభిప్రాయాలు తెలుసుకుంటానని ఇప్పటికే పన్నీర్ సెల్వం ప్రకటించారు. 
 
పన్నీర్ సెల్వంతో పాటు దీపా కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి శశికళ కుట్రలు, కుళ్లు రాజకీయాల గురించి ప్రజలకు వివరాలించాలని రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. జయలలిత మరణించిన తరువాత ఆమె మేనకోడలు దీపా బహిరంగంగా మీడియా ముందు శశికళ మీద విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న అన్నాడీఎంకే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు దీపా పేరవై సంస్థను స్థాపించి దీపాకు మద్దతు ఇచ్చారు. ఫిబ్రవరి 24వ తేది జయలలిత జయంతి సందర్బంగా తాను కొత్త పార్టీ పెడుతున్నానని ఇప్పటికే దీపా ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి