ముంబైలో దారుణం.. ఐదేళ్ళ పాపను 15 అంతస్తుల భవంతి నుంచి విసిరేసిన మహిళ

మంగళవారం, 20 డిశెంబరు 2016 (11:05 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో మరో మహిళ గొడవపడింది. అంతటితో కసి తీరక ఆ మహిళా కానిస్టేబుల్‌కు చెందిన ఐదేళ్ల కుమార్తెను 15 అంతస్తుల భవనం నుంచి కిందికి విసిరేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ముంబైలోని బైకుల్లాలో గల న్యూ హింద్‌ మాదా కాలనీలో 22 అంతస్తుల భవనం ఉంది. ఇందులో అశోక్‌, ఆర్తి అనే దంపతులు 15వ అంతస్తులో నివశిస్తున్నారు. వీరిలో ఆర్తి వర్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌‌గా పనిచేస్తుండగా అశోక్‌ మాత్రం ఆటో మొబైల్‌ వ్యాపారం చూసుకోవడంతోపాటు ఓ షోరూంలో పనిచేస్తున్నాడు. సోమవారం ఆర్తి తన ఉద్యోగానికి వెళ్లగా అశోక్‌ ఇంట్లోనే ఉన్నాడు. వీరికి ఐదేళ్ళ పాప ఉంది. 
 
ఈమె గ్లోరియా ప్రి ప్రైమరీ స్కూల్లో చదువుతోంది. ఈ పాప బయట ఆడుకుంటూ ఉన్నది. అయితే, ఆ పాపను ఉన్నట్టుండి 15వ ఫ్లోర్‌ నుంచి కిందకు ఓ మహిళ తోసేసింది. ఆ భవనంలో ఉన్నవారందరినీ ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసేలా చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మహిళా కానిస్టేబుల్‌‌తో ఉన్న గొడవ కారణంగానే పసికందుకు ఆ మహిళ కిందికి విసిరేసి ఉంటుందని భావిస్తున్నారు. పరారీలో ఉన్న మహిళా నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భవనంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి