కిలాడి లేడీ... యూట్యూబ్ వీడియో చూసి దొంగనోట్ల ముద్రణ

మంగళవారం, 5 మార్చి 2019 (16:24 IST)
తమిళనాడు రాష్ట్ర కడలూరు జిల్లాలో ఓ కిలాడీ లేడి గుట్టుచప్పుడుకాకుండా చేస్తూ వచ్చిన ఓ గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. యూట్యూబ్‌ వీడియోను చూసి దొంగ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న వైనాన్ని పోలీసులు కనుగొన్నారు. అప్పుల భారం నుంచి బయటపడేందుకు ఆమె ఈ పని చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడలూరు జిల్లా మారియప్ప నగర్‌కు చెందిన భరణి కుమారి ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. కుంటుంబ ఇబ్బందుల కారణంగా ఇరుగు పొరుగు వారి వద్ద అప్పులు చేసింది. కానీ వాటిని తీర్చలేకపోయింది. భరణి కుమారికి అప్పు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని భరణి కుమారికి ఓ ఐడియా వచ్చింది. 
 
యూట్యూబ్‌లో దొంగ నోట్ల ముద్రణ వీడియో చూసి.. దొంగనోట్లను ముద్రించాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఇంట్లోనే దాదాపు రూ.లక్ష విలువ చేసే నకిలీ నోట్లను ముద్రించింది. వాటిని సమీపంలోని చిల్లర దుకాణాల్లో మారుస్తూ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో సోమవారం కడలూరులోని ఓ దుకాణానికి వెళ్లి సామాన్లు కొన్న భరణి నకిలీ రెండు వేల రూపాయల నోటును ఇచ్చింది. అనుమానం వచ్చిన దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల రాకను గమనించిన భరణి సమీపంలోని బస్టాండ్‌కు వెళ్లి చిదంబరం వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంది. 
 
పోలీసులు బస్టాండ్‌ అంతా వెతికి చివరకు బస్సు ఎక్కి చూడగా, అందులో భరణి కనిపించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికే నకిలీ నోట్ల ముద్రణ ప్రారంభించినట్లు భరణి పోలీసుల విచారణలో వెల్లడించింది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు