అత్యాచార చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న మహిళలు

ఆదివారం, 23 జులై 2023 (14:47 IST)
అత్యాచార చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భాగస్వాములతో భేదాభిప్రాయాలు తలెత్తిన సమయంలో ఈ చట్టాన్ని వారు ఓ ఆయుధంగా వాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై అతడి మాజీ ప్రేయసి దాఖలు చేసిన అత్యాచారం కేసును కొట్టేస్తూ న్యాయమూర్తి శరద్ కుమార్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ వ్యక్తిపై మహిళ అత్యాచారం కేసు వేశారు. 2005 నుంచి వారు రిలేషన్‍లో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి జాబ్ వచ్చినా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలో వారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఆ తర్వాత అతడు మరో మహిళను వివాహం చేసుకోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. 
 
అయితే, అతడికి పెళ్లయ్యాక కూడా వారిద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో జూన్ 30న ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే, మహిళ దాఖలు చేసిన అత్యాచార కేసును కోర్టు కొట్టేసింది. 'అతడికి పెళ్లయిన తర్వాత కూడా పిటిషనర్ తమ బంధాన్ని కొనసాగించారు. అంటే.. ఆమె అతడితో బంధానికి అంగీకరించినట్టే' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 
 
అతడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అనేది తమ బంధం తొలినాళ్లలోనే నిగ్గుతేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. పరస్పర అంగీకారంతో శారీరకంగా దగ్గరయ్యాక పెళ్లికి నిరాకరిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు