నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

ఠాగూర్

గురువారం, 14 ఆగస్టు 2025 (17:22 IST)
వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్యకు గురైంది. ఆ యువతిని కన్నతండ్రితో పాటు ఆమె ఇద్దరు బాబాయిలే హత్య చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మృతురాలి పేరు చంద్రిక (18). గుజరాత్ రాష్ట్రంలోని బనాస్కాంఠా ప్రాంత వాసిగా గుర్తించారు. 
 
ఈ యువతి ఇటీవల పరువు హత్యకు గురైంది. ఈ యువతిని ఆమె తండ్రి, ఇద్దరు బాబాయిలు హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నట్లు దంతా డివిజను ఏఎస్పీ సుమన్ నాలా బుధవారం తెలిపారు. నీట్ కోచింగ్ కోసం పాలన్పుర్ హాస్టలులో ఉన్న సమయంలో వివాహితుడైన హరేశ్ చౌదరి అనే యువకుడితో ఈమె ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించింది. ఈ విషయం ఇంట్లో తెలిసి ఆమెను కట్టడి చేశారు. 
 
ఇదేసమయంలో పోలీసులు ఓ పాత కేసులో హరేశ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. జూన్ 21న విడుదలైన హరేశ్ ఆమె ఆచూకీ కోసం గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషను దాఖలు చేశాడు. ఈ పిటిషను జూన్ 27న విచారణకు రానుండగా, 24వ తేదీ రాత్రి చంద్రిక మృతిచెందింది. మరుసటిరోజు ఉదయాన్నే హడావుడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. "ఆమెకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. నిద్రపోయాక గొంతు నులిమి చంపారు" అని ఏఎస్పీ వివరించారు. హరేశ్ ఫిర్యాదుతో కేసు నమోదుచేసి నిందితులు ఇద్దరిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు