పని చేస్తున్న కంపెనీనే మోసం చేసిన కేటుగాడు... పట్టించిన ఫేస్ డిటెక్టర్!

సోమవారం, 19 అక్టోబరు 2020 (15:07 IST)
పట్టుపని పాతికేళ్లు కూడా లేని ఓ యువకుడు... ఏకంగా తనకు అన్నంపెడుతున్న కంపెనీనే మోసం చేశాడు. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్ల వద్ద ఉద్యోగంలో చేరి... రెండు వేతనాలు తీసుకుంటూ వచ్చాడు. ఇలా ఒక యేడాది అతని మోసం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగిపోయింది. కానీ, ఎలక్ట్రానిక్ ఫేస్ డిటెక్టర్ ముందు ఆ కేటుగాడు ఆటలు సాగలేదు. దీంతో జైలు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాంకుమార్ దాస్ అనే పాతికేళ్ల యువకుడు గ్రేటర్ నోయిడాలోని మిందా కార్పొరేషన్స్ లిమిటెడ్ అనే సంస్థలో రెండేళ్ల కిందట ఉద్యోగిగా చేరాడు. మరో జాబ్ కాంట్రాక్టర్ ద్వారా గత సంవత్సరం జూన్ నెలలో అదే కంపెనీలో ఇంకో ఉద్యోగంలో చేరాడు.
 
ఇద్దరు జాబ్ కాంట్రాక్టర్ల నుంచి ఐడీ కార్డులు తీసుకున్న రామ్ కుమార్ దాస్ వేర్వేరు బయోమెట్రిక్ యంత్రాల్లో హాజరు వేయించుకునేవాడు. ఏడాది పాటు ఈ తంతు నిరాటంకంగా సాగింది. 
 
రెండు ఉద్యోగాలకు జీతాలు అందుకుంటూ బాగానే ఎంజాయ్ చేశాడు. అయితే మిందా కార్పొరేషన్స్ లిమిటెడ్ ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు వ్యవస్థ ఏర్పాటు చేయడంతో రామ్ కుమార్ దాస్ బండారం బట్టబయలైంది.
 
సంస్థకు చెందిన ఓ ఆఫీసుకు వెళ్లి హాజరు వేయించుకునే క్రమంలో ఫేస్ డిటెక్టర్ అతడిని వెంటనే పట్టేసింది. కంపెనీ డేటాబేస్‌లో అప్పటికే అతడి ఫొటో ఉండటంతో పన్నాగం పారలేదు. జరిగిన మోసాన్ని గుర్తించిన కంపెనీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు