దుర్గాదేవిని నవరాత్రుల్లో కొలిచేవారికి సర్వం శుభమే!

మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:03 IST)
అమ్మలగన్న అమ్మ దుర్గాదేవిని నవరాత్రుల్లో కొలిచేవారికి సకలసంపదలు చేకూరుతాయి. దేవీనవరాత్రుల్లో తొలి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధిస్తే అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజుల్లో సరస్వతి రూపాన్ని ఆరాధించడంతో జ్ఞానాన్ని పొందవచ్చునని పండితులు చెప్తున్నారు. అలా తొలి మూడు రోజుల్లో దుర్గానామ స్మరణచేసే వారికి అష్టైశ్వర్యములు చేకూరుతాయి.
 
"దుర్గా స్మరణజం దేవి దుర్గా స్మరణజం ఫలమ్
శైవో వా వైష్ణవో శాక్తో వా గిరినందిని
భజేద్దుర్గాం స్మరేద్దుర్గాం యచేదుర్దుర్గాం శివప్రియామ్" అన్నట్లు జీవిత లక్ష్యం మోక్షాన్ని పొందడమే. అందుచేత దుర్గానామం జపించేవారికి మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం.
 
నవరాత్రుల్లో తొలిమూడు రోజులు "దుర్గే దుర్గేతి దుర్గాయా : దుర్గే నామ పర మనుమ్
యో జపేత్ సతతం దేవి జీవన్ముక్త స్సమానవ:" అంటూ దుర్గామాతను జపించేవారు జీవన్ముక్తులవుతారని పండితులు చెబుతున్నారు. దేవతల నామాలన్నింటిలోనూ దుర్గనామం మేరుపూస వంటిది.
 
జగన్మాత నామాల్లో దుర్గానామం మహాద్భుతమైంది. అలాగే రామకృష్ణ శివాది నామాల్లో ఒక్కొక్క విశిష్టమే దాగి వుంది. కాని దుర్గానామంలో విశిష్ట గుణాలెన్నో వున్నాయి. కాబట్టే శ్రీ శంకరులు ముండమాలాతంత్రంలో దుర్గానామం పలికే చోట శివుడుండే కైలాస మందిరమే ఉంటుందన్నారు.
 
దుర్గానామాన్ని గ్రహించి, జపించి, స్మరించడం వల్ల సమస్త దేవతా నామోచ్ఛారణా ఫలితం లభిస్తుంది. ఏ రూపాన్ని ఉపాసించేవారైనా "దుర్గా, దుర్గా" అనడంవల్ల సమస్త ఆపదలనే సాగరాన్ని దాటడానికి దుర్గానామం నౌకవంటిదవుతుంది. ఎటువంటి కష్టనష్టాలు, దారిద్ర్యాలను అనుభవిస్తున్నా దుర్గానామాన్ని జపించడం వల్ల ఆపదలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
 
ఆరోగ్యభాగ్యానికి, సంపదల వృద్ధికి జ్ఞానోత్కర్షకు దుర్గానామమే ముఖ్యకారణం. కలియుగంలో ఇంతకంటే సులభోపాయం లేదని పురోహితులు సూచిస్తున్నారు. అందుచేత నవరాత్రుల్లో మాత్రమే గాకుండా ప్రతిరోజూ 1008 సార్లు దుర్గానామాన్ని జపించడం వల్ల సంతానం, రోగాల నుంచి విముక్తి, జ్ఞానం, ధనం వంటి ఫలితాలుంటాయి.
 
అలాగే దుర్గానామ అష్టోత్తర శతం 108 జపించేవారు ధనవంతుడు, జ్ఞాని, దీర్ఘాయుష్మంతుడు అవుతాడని పరమశివుడు పార్వతితో చెప్పినట్లు రుద్రయామళ తంత్రం చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు