నవరాత్రి దేవి.. శ్రీ కృష్ణుడిచే పూజలందుకున్నదా?

శుక్రవారం, 12 అక్టోబరు 2018 (10:59 IST)
శ్రీ కృష్ణ పరమాత్మ చేత తొలుత నవరాత్రి దేవి పూజలందుకుంది. గోకులం, బృందావనంలో నవదుర్గ పూజలందుకున్నట్లు పండితులు చెప్తున్నారు. "బ్రహ్మ"కైటభుల బారి నుండి రక్షణకై ఈమెను కృష్ణుడు స్తుతించి విముక్తి పొందినాడు. "పరమేశ్వరుడు" త్రిపురాసుర సంహార సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం సాధించాడు. 
 
దేవేంద్రుడు.. దుర్వాసుని శాపం వల్ల సంపదలను కోల్పోగా, పరాశక్తిని సేవించి తిరిగి సంపదలను పొందగలిగినాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధి, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవీ కటాక్ష పాత్రులవుతున్నారు. నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధనతో జ్ఞానాన్ని పొందాలని పండితులు చెప్తున్నారు. 
 
ఈ నవరాత్రి ఉత్సవాలలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసిందట. ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు.
 
ఇలా నవరాత్రులు జరుపుకుని ఒక విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో.. 
 
శ్లో శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ అని స్మరించి.. ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. శ్రీరామచంద్రుడు విజయదశమి, విజయ కాలమందు ఈ శమీపూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించడం ద్వారా శమీవృక్షము, 'రామస్య ప్రియదర్శిని' అయినది చెప్తుంటారు. 
 
అందుకే అసాధ్యాలను సుసాధ్యం చేయాలన్నా.. సర్వదుఃఖాలు తొలగిపోవాలన్నా.. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు చేకూరాలన్నా.. నవరాత్రుల్లో ఆ దేవదేవికి పూజలతోపాటు శ్రీలలితాసహస్రనామ పారాయణలు నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్షాలు పొందాలని పండితులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు