"ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ పొయెట్రీ" రేసులో వఘన్..!!

FILE
ప్రముఖ భారతీయ సంస్కృత స్కాలర్ వఘన్ పిలికాన్ ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ "ప్రొఫెసర్ ఆఫ్ పొయెట్రీ" పదవికోసం మరో పదిమందితో పోటీపడుతున్నారు. మహా భారతంతోపాటు అనేక పురాణేతిహాసలపై వఘన్ పుస్తకాలు రచించారు. అలాగే అనేక సమకాలీన భారతీయ సమస్యలపై పలు చిత్రాలను నిర్మించిన ఈయన, ఆక్స్‌ఫర్డ్ పొయెట్రీ ప్రొఫెసర్ పదవికోసం రేసులో నిలిచారు.

ఈ ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ పొయెట్రీ రేసులో వఘన్‌తోపాటు మరో పదిమంది పోటీపడుతున్నారు. మే 21వ తేదీ నుంచి జరిగే ఆన్‌లైన్ ఎన్నిక ప్రక్రియలో ఎవరైతే విజయం సాధిస్తారో, వారికి పొయెట్రీ ప్రొఫెసర్ పదవి దక్కుతుంది. కాగా.. ఈ ఎన్నిక ప్రక్రియ జూన్ 16వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఇప్పటిదాకా ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయం పదవి భర్తీకి ఒకే రోజులో ఎన్నిక నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇటీవలే ఎన్నిక విధానాన్ని సవరించారు. సవరించిన విధానం ప్రకారం ఆన్‌లైన్ ద్వారా పోలైన ఓట్ల ద్వారా ప్రొఫెసర్ ఆఫ్ పొయెట్రీ ఖాళీని భర్తీ చేస్తారు. ఇదిలా ఉంటే.. పొయెట్రీ ప్రొఫెసర్‌ను నియమించే భర్తీ కమిటీకి ఆంగ్ల విభాగ ఉప అధిపతి డాక్టర్ శామ్యూస్ పెర్రీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పెర్రీ మాట్లాడుతూ.. సవరించిన ఎన్నిక విధానం ద్వారా పొయెట్రీ ప్రొఫెసర్‌ను ఎన్నుకునే ప్రక్రియలో ఎక్కువమందికి భాగస్వామ్యం కల్పించే వీలు కలుగుతోందన్నారు. అలాగే ఈ పదవికి సంబంధించి అనేక నామినేషన్లు రావటం అనేది కూడా చాలా శుభ పరిణామమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఈ పొయెట్రీ ప్రొఫెసర్ ఎన్నిక విధానం పూర్తయిన తరువాత జూన్ 18వ తేదీ శుక్రవారంనాడు విజేతను ప్రకటిస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి