ఆసీస్ దాడులకు నిరసనగా వెబ్‌సైట్ల హ్యాకింగ్..!

FILE
ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆ దేశంలోని పలు వ్యాపార వెబ్‌సైట్లపై హ్యాకర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. భారతీయ విద్యార్థులు అధికంగా దాడులకు గురయిన మెల్‌బోర్న్‌కు చెందిన ఐదు వ్యాపార వెబ్‌సైట్లను హ్యాక్ చేసి, సమాచారాన్ని కొల్లగొట్టిన హ్యాకర్లు.. దాడులను ఆపకపోతే మరిన్ని సైట్లను హ్యాక్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

కాగా.. ఈ హ్యాకింగ్ దెబ్బకు మెల్‌బోర్న్ నగరంలోని ఓ కంపెనీ మొత్తం సమాచారాన్ని కోల్పోవటమే గాకుండా, తన కంప్యూటర్ వ్యవస్థకు మరమ్మత్తులు చేయించుకునేందుకు 48 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై రాయల్ మెల్‌బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఇంటర్నెట్ భద్రతా అధ్యాపకుడు మార్క్ గ్రేగరీ మాట్లాడుతూ.. ఆర్థిక లబ్దితో కాకుండా, ప్రతీకారంతో సైబర్ హ్యాకర్లు వెబ్‌సైట్లపై దాడి చేయటం అసాధారణ విషయమని, అయితే ఇది తమల్ని ఆశ్చర్యపర్చలేదని అన్నారు.

ఇప్పుడు చర్చనీయాంశమైన దాడుల అంశం దీనికి ప్రేరణ అయి ఉండవచ్చునని మార్క్ తెలిపారు. అయితే సంస్థలు తమ వెబ్‌సైట్‌లు హ్యాకింగ్‌కు గురవకుండా చూసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఒకసారి వెబ్‌సైట్‌లు హ్యాకింగ్‌కు గురయితే, మరోసారి ఈ తరహా దాడికి దిగటం సులువవుతుందనీ, దీంతోవారు తక్కువ సమయంలోనే చాలా కంపెనీలపై హ్యాకింగ్‌కు దిగవచ్చునన్నారు.

వెబ్దునియా పై చదవండి