వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

ఠాగూర్

సోమవారం, 20 మే 2024 (22:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ప్రమాణ స్వీకారం చేస్తారని వైకాపా ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9వ తేదీ ఉదయం 9.38 గంటలకు విశాఖపట్టణం వేదికగా "వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను.." అంటూ రాజన్న బిడ్డ మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 175 అసెంబ్లీ సీట్లకు గాను అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాల్లో తమ పార్టీకి 150కి పైగా సీట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. 
 
వైకాపా మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం. ఇచ్చిన మాట ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి విశాఖలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 9వ తేదీ ఉదయం 9.38 గంటలకు విశాఖలోనే పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంపై మా పార్టీ నేతలతో చర్చిస్తా అని తెలిపారు. 
 
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీకి మైనారిటీలు, బీసీలు, దళితులు, గిరిజనులు, మహిళలు అండగా నిలబడ్డారని తెలిపారు. మహిళలు అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోయినా ఎండను కూడా లెక్కచేయకుండా ఓటు వేసేందుకు నిలడ్డారని కొనియాడారు. సీఎం జగన్‌పై మహిళలు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తే తమకు లబ్ది చేకూరుతుందని మహిళలు గట్టిగా నమ్మడం వల్లే వారు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఫ్యాను గుర్తుకు ఓటు వేశారని వైవీ సుబ్బారెడ్డి జోస్యం చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు