"ఫాక్స్" వ్యాఖ్యాత క్షమాపణ చెప్పాలి : ఎన్నారైలు

FILE
హిందువులు పరమ పవిత్రంగా భావించే గంగానదిపైన, భారతీయ వైద్యులపైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన "ఫాక్స్ న్యూస్" వ్యాఖ్యాత గ్లెన్‌బెక్‌‌పై అమెరికాలోని ప్రవాస భారతీయులు మండిపడుతున్నారు. గ్లెన్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎన్నారైలు డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. "గంగ" అనే పదంలో "రోగం" వినిపిస్తోందని "ది వన్ థింగ్" అనే కార్యక్రమంలో గ్లెన్‌బెక్‌ వ్యాఖ్యానించాడు. అలాగే మరో కార్యక్రమంలో భారతీయ వైద్యులను, వైద్యాన్ని కూడా బెన్ అవమానిస్తూ మాట్లాడాడు. ఇండియాలో ఆపరేషన్ చేయించుకుని వచ్చి అమెరికన్ కార్లీన్ జింబెల్‌మాన్‌ను ఇంటర్వ్యూ సందర్భంగా బెన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

దీంతో గ్లెన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా భారత సంతితి వైద్యుల సంఘం (ఏఏపీఐ) మండిపడింది. అతగాడి వ్యాఖ్యలు భారత వైద్యులను కించపరిచేవిగా ఉన్నాయంటూ ఏఏపీఐ అధ్యక్షుడు వినోద్ కే షా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే గ్లెన్ వివాదాస్పద వ్యాఖ్యలను భారత్-అమెరికా రాజకీయ కార్యాచరణ సమితి (యూఎస్ఐఎన్‌పీఏసీ) ఖండించింది. భారతీయులకు గ్లెన్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టింది.

ఈ సందర్భంగా యూఎస్ఐఎన్‌పీఏసీ ఛైర్మన్ సంజయ్ పూరి మాట్లాడుతూ.. భారతీయుల మత సంప్రదాయాన్ని, గంగానదిని అవమానపరిచిన గ్లెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతగాడి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని హిందూ నాయకుడు రాజన్ జెడ్ ఆరోపించారు. ఇదిలా ఉంటే.. గ్లెన్ వ్యాఖ్యలపై అమెరికా జాతీయ సమాచార కమీషన్‌కు హిందూ జాగరణ సమాఖ్య రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసింది.

వెబ్దునియా పై చదవండి