ఎన్నారైలకు హిందూ వివాహ చట్టం వర్తించదు: ముంబై హైకోర్టు

FILE
హిందూ సంప్రదాయాలపై మక్కువతో భారతదేశం వచ్చి పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రవాస భారతీయులకు హిందూ వివాహ చట్టం (హెచ్ఎంఏ) వర్తించబోదని ముంబయి హైకోర్టు స్పష్టం చేసింది. అమెరికాలో నివాసం ఉంటున్న కారణంగా భారతీయ జంటలు హిందూ వివాహ చట్టం పరిధిలోకి రావని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

కాగా.. అమెరికన్ భారతీయ జంట సెలవుల్లో ఒకరోజున భారత్ వచ్చి గడిపిన కారణంగా వారి విడాకుల కేసును విచారించే అవకాశం ఉందంటూ పూనే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా ముంబయి హైకోర్టు న్యాయమూర్తి రోషన్ దాల్వీ కొట్టివేస్తూ, పై విధంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. అమెరికా కోర్టులో విడాకులు పొందిన మిచిగాన్‌కు చెందిన ప్రవాస భారతీయురాలు ఒకరు దాఖలు చేసిన పిటీషన్‌ను ముంబై హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు అమెరికాలో నివసిస్తున్న ఆమె భర్త భారత్ తిరిగివచ్చి పూనే కోర్టులో విడాకుల పిటీషన్ దాఖలు చేశారు.

దీంతో.. ఈ కేసును విచారించిన ముంబై హైకోర్టు, భారత్‌లో స్వంత ఇల్లు ఉన్నప్పటికీ ఇక్కడ దంపతులు ఇద్దరూ ఏరోజూ కలిసి జీవించలేదని, వారు కలిసి జీవించిన ఇల్లు అమెరికాలో ఉంది కాబట్టి, సుహాస్ కేసు పూనే కోర్టు పరిధిలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. అంతేగాకుండా వారికి హిందూ వివాహ చట్టం వర్తించబోదు కాబట్టి, ఈ దంపతులు అమెరికా కోర్టు ఇచ్చిన విడాకులను అక్కడే సవాలు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.

వెబ్దునియా పై చదవండి