రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

ఠాగూర్

ఆదివారం, 6 జులై 2025 (13:19 IST)
నాలుగు దశాబ్దాల క్రితం రెండు హత్యలు చేసిన వ్యక్తికి నాలుగు దశాబ్దాల పశ్చాత్తపం చెందుతూ పోలీసులకు లొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళలోని కొయ్‌‍కేడుకు చెందిన మహమ్మదాలి (53) అనే వ్యక్తి నెల రోజుల క్రితం మలప్పురం జిల్లాలోని వెంగరా పోలీస్ స్టేషనులో లొంగిపోయాడు. 
 
తన పెద్ద కుమారుడు ప్రమాదంలో చనిపోవడం, చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడటంతో పాటు కుటుంబంలో నిత్యం సమస్యలు ఎదురవుతుండటంతో.. తాను గతంలో చేసిన నేరాలే వీటికి కారణమని నమ్మాడు. ఇక ఆ రహస్యాన్ని దాచిపెట్టలేక పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పేశాడు.
 
మహమ్మదాలి చెప్పిన వివరాల ప్రకారం 1986లో తనను తరచూ వేధిస్తున్న ఓ 20 ఏళ్ల యువకుడిని ఆత్మరక్షణ కోసం తన్నడంతో అతడు కాలువలో పడిపోయాడు. దీంతో భయంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. రెండు రోజుల తర్వాత వచ్చి చూడగా ఆ యువకుడు నీటిలో విగతజీవిగా కనిపించాడు. అప్పట్లో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు దానిని సాధారణ మరణంగా నమోదు చేసి కేసును మూసివేశారు.
 
ఆ తర్వాత 1989లో వెల్లయిల్ బీచ్‌లో మరో వ్యక్తిని హత్య చేసినట్టు కూడా మహమ్మదాలి ఒప్పుకున్నాడు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు, ఆ సమయంలో అక్కడ ఓ గుర్తుతెలియని మృతదేహం దొరికిన మాట వాస్తవమేనని తేలింది. 
 
అయితే, ఆధారాలు లేకపోవడంతో ఆ కేసును కూడా అప్పట్లోనే మూసివేసినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఈ రెండు కేసులకు సంబంధించిన పాత ఫైళ్లను పోలీసులు తిరగదోడుతున్నారు. మహమ్మదాలి చెబుతున్న విషయాల్లో నిజానిజాలను నిర్ధారించుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు