పునరావాస కేంద్రానికి శ్రావణ్ కుమార్

ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్న తెలుగు విద్యార్థి శ్రావణ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి మెల్లిగా కుదుట పడుతుండటంతో... అతడిని పునారావాస కేంద్రానికి తరలించనున్నారు. తరువాతి చికిత్స కోసం శ్రావణ్‌ను పునరావాస కేంద్రానికి తరలించాలని డాక్టర్లు భావిస్తున్నారని, అతడి బాబాయి శ్రీనివాస్ తీర్థాల పేర్కొన్నారు.

శ్రావణ్ పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చునని చెప్పిన శ్రీనివాస్... అతడి పునరావాసానికి అవసరమైన ఖర్చును చెల్లించేందుకు క్రైం కాంపెన్సేషన్ కోర్టు అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు.

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రావణ్ ప్రాణాలతో పోరాడాడనీ, మెరుగైన చికిత్సలు అందటంలో క్రమంగా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. శ్రావణ్ తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడనీ, తమ చర్యలకు స్పందిస్తున్నాడని వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే... మెల్‌బోర్న్‌లో తన స్నేహితులతో కలసి పార్టీ చేసుకుంటున్న శ్రావణ్‌, అతడి ముగ్గురు స్నేహితులపై గత నెలలో దుండగులు స్క్రూడ్రైవర్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాకు చెందిన ముచ్చెర్ల గ్రామంలో జన్మించిన శ్రావణ్, రెండేళ్ల క్రితం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు.

వెబ్దునియా పై చదవండి