ప్రవాసాంధ్రులకు కొణిజేటి రోశయ్య విజ్ఞప్తి..!

FILE
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దెబ్బమీద దెబ్బ తగులుతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రవాసాంధ్రులు ఇతోధికంగా తమ సహాయ సహకారాలను అందించాలని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విజ్ఞప్తి చేశారు. కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నదుల వరదలతో అతలాకుతలమైన బాధితులను ఇప్పటికే అన్నిరకాలుగా ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రవాసాంధ్రులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

భారత జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్, న్యూజెర్సీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన ప్రైవేట్ టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య పై విధంగా స్పందించారు. సుమారు ఆరు వందల మందికిపైగా హాజరైన ఈ సమావేశంలో.. మాతృభూమి కోసం ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.

వరదల కారణంగా లక్షలాది ఎకరాలలో పంటలు మునిగిపోయాయనీ, ఇళ్లు ధ్వంసమైపోయి ప్రజలంతా నిరాశ్రయులయ్యారని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిరకాలుగా నష్టపోయిన వేలాది మంది గ్రామీణ ప్రజలకు చేయూతనిచ్చేందుకు ప్రవాసాంధ్రులు మరింత ఉదారంగా ముందుకు రావాలని ఆయన కోరారు. వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన పునరావాస కార్యక్రమాలు మరింత వేగంగా, ఎక్కువగా నిర్వహించేందుకు... ఉదారంగా విరాళాలు సేకరించాలని రోశయ్య ప్రవాసాంధ్రులకు సూచించారు.

వెబ్దునియా పై చదవండి