తల్లిదండ్రుల తృప్తి కోసమే తెలుగు అమ్మాయిలు... ఎన్నారై అబ్బాయిల వరస ఇదీ...

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (21:14 IST)
ఎన్నారై సంబంధం అనేది ఎప్పటి నుంచో అదో క్రేజ్. మా అల్లుడు అమెరికాలో వుంటున్నాడు.. మా అబ్బాయి లండన్‌లో వుంటున్నాడు అని చెప్పుకుని మురిసిపోయేవారు చాలామందే. ఐతే విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడిన ఎన్నారై అబ్బాయిలు ఇండియాలో వుండే తమ తల్లిదండ్రుల తృప్తి మేరకు మాత్రమే ఇక్కడి అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుంటున్నారట. అలాంటి రాష్ట్రాల్లో ముందువరుసలో వుంటున్నవి తెలుగు రాష్ట్రాలని గణాంకాలు చెపుతున్నాయి. ఆ తర్వాత పంజాప్, గుజరాత్ రాష్ట్రాలు వుంటున్నాయట. 
 
విదేశీ ఉద్యోగం, డాలర్ల డబ్బు, అమ్మాయికి ఎలాంటి ఢోకా వుండదు అనుకునేవారికి ఇదో చేదు వార్తే. ఎందుకంటే విదేశీమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2015 నుంచి 2017 మధ్య కాలంలో... అంటే 1064 రోజులకు గాను విదేశాల్లో నివాసముంటున్న ఎన్నారై భార్యల నుంచి 3,328 ఫిర్యాదులు వచ్చాయట. ఈ ఫిర్యాదుల్లో తమతమ భర్తలు తమను కట్నం కోసం వేధిస్తున్నారనో, తమను చిన్నచూపు చూస్తున్నారనో, ఇంకా హింసిస్తున్నారనో పేర్కొన్నారట.
 
వాషింగ్టన్ లోని భారతదేశ విదేశీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్తీ రావు మాట్లాడుతూ... తమకు ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు వెనువెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తెలుగు ఎన్నారై మహిళలను కట్నం కోసమే వేధిస్తున్నట్లు తమకు అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులను తృప్తి పరిచేందుకే ఇక్కడ పనిచేసే ఎన్నారై అబ్బాయిలు తెలుగు రాష్ట్రాలకు వెళ్లి తెలుగు అమ్మాయిలను పెళ్లాడుతున్నారనీ, పెళ్లయ్యాక చాలామంది వారి భార్యలను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు