అమెరికాలో హైదరాబాద్ యువతిపై అత్యాచారం

అమెరికాలోని న్యూజెర్సీలో.. ఇంటర్నెట్ స్నేహాన్ని అలుసుగా తీసుకుని, తెలుగమ్మాయిపై అత్యాచారం చేయడమేగాకుండా.. ఆమె ఇంట్లో దొంగతనానికి కూడా ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. పైగా విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరించాడు. ఈ వ్యవహారంపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలుసుకున్న ఈ ప్రబుద్ధుడు పారిపోయి ఇండియా వచ్చేశాడు.

వివరాల్లోకి వస్తే... హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్‌కు చెందిన పద్దెనిమిది సంవత్సరాల యువతి, పదేళ్ల క్రిందట తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. తల్లిదండ్రులు అక్కడే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగాలు చేస్తుండగా, ఆ అమ్మాయి చదువుకుంటోంది.

ఇంటర్నెట్ ఛాటింగ్‌లో ఆమెకు న్యూయార్క్ వాసి అయిన సుంకా శ్రీనివాస్ అనే 25 ఏళ్ల కుర్రాడు పరిచయం అయ్యాడు. హైదరాబాదీగా తనను తాను పరిచయం చేసుకున్న ఆ అబ్బాయి.. క్రమం తప్పకుండా 3 నెలలపాటు ప్రతిరోజూ చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో ఆమె మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న విషయం పసిగట్టిన శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నాడు. బలవంతంగా ఇంటి తలుపులు మూసి ఆమెపై అత్యాచారం జరిపాడు.

నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆ అమ్మాయి.. ఈ విషయాన్ని తనలోనే దాచుకుని కుమిలిపోయింది. దీన్ని అలుసుగా తీసుకున్న శ్రీనివాస్ వారం తరువాత తిరిగి ఆమె ఇంటికి వచ్చి మరోసారి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేగాకుండా 35వేల అమెరికా డాలర్లతోపాటు, బంగారు ఆభరణాలను కూడా దోచుకుని పారిపోయాడు.

దీంతో ఆ అమ్మాయి జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించి భోరున విలపించింది. కూతురికి జరిగిన అన్యాయంపై ఆగ్రహించిన ఆమె తల్లిదండ్రులు న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి శ్రీనివాస్‌పై అత్యాచారం, దోపిడీ, బెదిరింపులు తదితర సెక్షన్లపైన కేసు పెట్టారు.

విషయం తెలుసుకున్న శ్రీనివాస్ న్యూయార్క్‌లోని తన ఇంటికి తాళం వేసి.. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ చేరుకున్నట్లు అక్కడి పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ తరువాత కేసు విత్‌డ్రా చేసుకోకపోతే చంపేస్తానంటూ, నిందితుడు పలుమార్లు ఫోన్లో బెదిరించినట్లు ఆ అమ్మాయి తల్లి పోలీసులకు వివరించారు.

శ్రీనివాస్ దురాగతంతో తీవ్రమైన మానసిక వేదనకు గురైన ఆ అమ్మాయి అనారోగ్యానికి గురై.. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... నిందితుడి ఫోటోలు తప్పిస్తే, తమ వద్ద అతడికి సంబంధించిన ఎలాంటి వివరాలు లేవని, స్నేహితుడంటూ నమ్మంచి మోసం చేసిన శ్రీనివాస్‌కు తగిన శిక్ష పడాలని బాధితురాలు ఆవేశంగా చెప్పింది.

వెబ్దునియా పై చదవండి