కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర మహిళ మృతి

FILE
కూతురి ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన 54 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ మహిళ కాలిఫోర్నియాలో గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ఉత్తర కాలిఫోర్నియా రాష్ట్రంలోని మారిస్ విల్లేలో మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది.

కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ (54)ను ఓ కారు ఢీకొట్టింది. సమీపంలోగల కుమార్తె ఇంటికి నడచుకుంటూ వెళుతున్న సుబ్బలక్ష్మమ్మ రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

మరో పది రోజుల్లో తన సొంత ఊరికి తిరిగి వెళ్ళనున్న సుబ్బలక్ష్మమ్మ ఊహించని విధంగా మరణించటంతో ఆమె భర్త భోరెడ్డి, కూతురు శశికళాదేవి, కుమారుడు భోగేశ్వరరెడ్డిలు భోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు కోమటి జయరాంతో పాటు పలువురు ఎన్నారై ప్రముఖులు సుబ్బలక్ష్మమ్మ మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈ సందర్భంగా తానా వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి