భారత సంతతికి చెందిన మాజీ మోడల్, నటి పద్మాలక్ష్మి ఓ అందమైన అమ్మాయికి జన్మనిచ్చింది. న్యూయార్క్లో పురుడుపోసుకున్న పద్మ, ఆ పండంటి బిడ్డకు "కృష్ణ"గా నామకరణం చేసినట్లు ఆమె ప్రతినిధి చెప్పినట్లుగా "యూఎస్ మేగజైన్" ఓ కథనంలో వెల్లడించింది.
కాగా.. గత ఏడాది అక్టోబర్లో తాను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు చెప్పిన 39 సంవత్సరాల పద్మాలక్ష్మి, ఆ బిడ్డకు తండ్రెవరో మాత్రం బయట పెట్టడం లేదు. అయితే ఆడమ్ డెల్ అనే వ్యాపార వేత్తే పద్మ బిడ్డకు తండ్రి కావచ్చునని మీడియా వర్గాలు సందేహిస్తున్నాయి. అదే విధంగా కార్పొరేట్ ధిగ్గజం టెడ్డీ ఫోర్స్ట్మాన్తో ఆమెకు సంబంధాలున్నాయనీ, కాబట్టి అతడే పాపకు తండ్రి అయి ఉంటాడని కూడా పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.
ఇదిలా ఉంటే.. గర్భాశయ సమస్యలతో బాధపడుతున్న తాను గర్భం దాల్చటమే ఓ అద్భుతమైన విషయమనీ ఈ మేరకు పద్మ సంతోషం వ్యక్తం చేసింది. కాగా.. భారత సంతతికే చెందిన వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ మాజీ భార్య అయిన ఈమె ఇటీవల టీవీ వంటల కార్యక్రమాల వ్యాఖ్యాతగా మారి అనేకమంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.