మార్చి 9, సెప్టెంబరు 1న సంపూర్ణ సూర్యగ్రహణాలు... ఏప్రిల్ 17 నుంచి జూన్ 17 దాకా గ్రహ స్థితులు అనుకూలించడం లేదని... ఈరోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ పంచాగకర్త పొన్నలూరి శ్రీనివాస గార్గేయ హెచ్చరించారు. శత్రు గ్రహలైన శని కుజులు ఈ సమయంలో కలిసి వక్ర సంచారం చేయనున్నాయని దీనితో పాటు సింహ రాశిలో గురు రాహువుల కలయిక సంభవిస్తుందని తెలిపారు. ఈ గ్రహ స్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల హింసాత్మక పరిస్థితులు, అశాంతి, దేశాలు, రాష్ట్రాల మధ్య కలతలు, సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. పాలకులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏప్రిల్ 17 నుంచి శని, కుజ గ్రహాల వక్ర సంచారం జూన్ 17 వరకూ ఉంటుందని, దీనివల్ల రెండో ప్రపంచ యుద్ధం నాటి భయానక పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని శ్రీనివాస గార్గేయ తెలిపారు. ఈ నెల 9న ఏర్పడే సూర్యగ్రహణం మన దేశంలో పాక్షికంగా కనిపిస్తుంది. దీనివల్ల భూకంపాలు వచ్చే పరిస్థితి ఉందన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు సూర్య యాగాలు, లలిత అమ్మవారి పూజలు చేయనున్నామని గార్గేయ చెప్పారు. తొలి యాగం ఈ నెల 6న హైదరాబాద్లో నిర్వహిస్తున్నామన్నారు.