ఈ పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ఆరాధించడం విశేషమైన పూజా ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ పరివర్తిని ఏకాదశిని ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షం 11వ రోజు ఏకాదశి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యొక్క వామన అవతారాన్ని పూజిస్తారు. శ్రీమహావిష్ణువు దేవశయని ఏకాదశి నుంచి యోగ నిద్రలోకి వెళ్లి.. భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజు భుజం మార్చుకుని మరోవైపుకి తిరిగి నిద్రపోతాడని చెబుతారు.
ఈరోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసే వారు రోజంతా ఉపవాసం ఉండాలి. శ్రీలక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో, చేమంతులతో పూజించాలి. చక్ర పొంగలి, పులగం వంటివి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంటి దగ్గర్లోని విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించాలి.
ఇక పరివర్తిని ఏకాదశి రోజు సాయంత్రం దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీవిష్ణు సహస్రనామం పారాయణ చేయాలి. రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణం కంటే ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వేల రెట్లు ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు శివపార్వతులను, వినాయకుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు.