Parivartini Ekadashi 2025: పరివర్తని ఏకాదశి ఎప్పుడు.. ఎలా జరుపుకోవాలి.. కృష్ణుడు యుధిష్ఠిరునికి...?

సెల్వి

మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (12:08 IST)
Parivartini Ekadashi
భాద్రపద మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు. ఈసారి 2025 సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 04:53 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై.. సెప్టెంబర్ 4వ తేవీ ఉదయం 4:21 గంటలకు ముగియనుంది. ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 3వ తేదీన పరివర్తిని ఏకాదశి పండుగ జరుపుకోవాలి. ఈ ఉపవాసం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠిరుడికి చెప్పినట్లు పండితులు చెబుతారు. 
 
ఈ పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ఆరాధించడం విశేషమైన పూజా ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ పరివర్తిని ఏకాదశిని ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షం 11వ రోజు ఏకాదశి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యొక్క వామన అవతారాన్ని పూజిస్తారు. శ్రీమహావిష్ణువు దేవశయని ఏకాదశి నుంచి యోగ నిద్రలోకి వెళ్లి.. భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజు భుజం మార్చుకుని మరోవైపుకి తిరిగి నిద్రపోతాడని చెబుతారు. 
 
ఈరోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసే వారు రోజంతా ఉపవాసం ఉండాలి. శ్రీలక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో, చేమంతులతో పూజించాలి. చక్ర పొంగలి, పులగం వంటివి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంటి దగ్గర్లోని విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించాలి. 
 
ఇక పరివర్తిని ఏకాదశి రోజు సాయంత్రం దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీవిష్ణు సహస్రనామం పారాయణ చేయాలి. రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణం కంటే ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వేల రెట్లు ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు శివపార్వతులను, వినాయకుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు.
 
పరివర్తిని ఏకాదశి రోజు ఆగిపోయిన పనులు పూర్తికావాలంటే ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడిని పూజించాలి. ఈ పూజ చేయడం వల్ల జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయని విశ్వాసం. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు