భార్యపై ఎందుకంత కోపం వస్తోంది... భర్త ఇలా చేస్తున్నాడా?

మంగళవారం, 31 జులై 2018 (22:36 IST)
ఈమధ్య కాలంలో చిన్నచిన్న సమస్యలకే భార్యాభర్తలు విడాకులు తీసేసుకుంటున్నారు. ఫలితంగా వివాహాలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. అయితే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనస్పర్ధలు పెద్ద సమస్యలు కాబోవు. భర్త ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్యను ప్రేమతో పలకరించడం అలవాటుగా పెట్టుకోవాలి. 
 
ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు కంప్యూటర్ ముందుకు కూర్చోవడం, టీవీని చూస్తూ కాలయాపన చేయడం వంటివి కూడదు. ముఖ్యంగా భోజనం చేసే సమయంలోనూ, బెడ్రూమ్‌లోనూ సెల్‌ఫోన్ వాడకపోవడం మంచిది. భార్యాభర్తల మధ్య ఏదయినా సమస్య వచ్చినప్పుడు వాదించుకోవడం వల్ల అది పెరుగుతుందే తప్ప తగ్గదు. అటువంటి సమయంలో ఇద్దరూ పోట్లాడడం మాని, అసలు సమస్య తీరే మార్గం కోసం అన్వేషించాలి.
 
ఉద్యోగాలు చేస్తూ, ఎన్నిపనులున్నా సరే ఇద్దరూ కలిసి ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాలి. ఆర్ధికపరమైన ఇబ్బందులు, పనుల ఒత్తిళ్లు ఎన్నున్నా ఇద్దరూ శృంగారానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇద్దరి మధ్యా స్పష్టమైన భావవ్యక్తీకరణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 
భాగస్వామిలో ఏదైనా ప్రత్యేకతను గమనించినట్లైతే దాన్ని ప్రశంసించేందుకు ఎప్పుడూ వెనకాడకండి. ఎదుటివాళ్లలో వచ్చిన ఏ మంచి మార్పు అయినా సరే గుర్తించాలి, అభినందించాలి. మీ భాగస్వామిని ఎవరికైనా పరిచయం చేస్తున్నప్పుడు కేవలం పేరూ, ఉద్యోగం కాకుండా ప్రత్యేకతలుంటే వాటిని కూడా చెప్పాలి. అలా చేయడం ద్వారా ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో తరచు నవ్వు తెప్పించే వీడియోలు, టీవీ ప్రోగ్రామ్‌లు చూడటం, పుస్తకాలు చదవడానికి చేయండి. ఇలా ఇద్దరూ కలిసి నవ్వడం వలన భార్యాభర్తలు ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు