హీరోయిన్ల వ్యభిచార కేసు : కిషన్ దంపతులకు 18న శిక్షలు ఖరారు

ఆదివారం, 15 జులై 2018 (10:31 IST)
తెలుగు చిత్ర పరిశ్రమనే కాకుండా, అమెరికాను సైతం ఓ ఉలికిపాటుకు గురిచేసిన ఘటన చికాగో వ్యభిచార రాకెట్. తెలుగు హీరోయిన్లతో అమెరికాలో స్థిరపడిన తెలుగు చిత్ర నిర్మాత మోదుగుమూడి కిషన్‌తో పాటు... ఆయన భార్య చంద్రకళ ప్రధాన ముద్దాయిలని కోర్టు తేల్చింది. ఈ కేసులో యుఎస్ పోలీసులు ఇప్పటికే విచారణ పూర్తి చేయగా, ఈనెల 18వ తేదీన కోర్టు శిక్షలను ఖరారు చేయనుంది.
 
తెలుగు హీరోయిన్లు, టీవీ యాంకర్లను అమెరికాలోని వివిధ సంఘాల కార్యక్రమాల పేరిట అమెరికాకు పిలిపించుకుని, వారితో వ్యభిచార దందా నడిపిన కిషన్, చంద్రకళ అలియాస్ విభాజయం దంపతులు ఈ కేసులో దోషులేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. 
 
ఈ కేసు విచారణలో భాగంగా, ఐదుగురు నటీమణుల సాక్ష్యాలను, వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అయిన డాలర్లు, వారి ప్రయాణ తేదీల వివరాలతో పాటు కిషన్ ఇంట్లో లభ్యమైన పలు సాక్ష్యాలను అమెరికా పోలీసులు కోర్టు ముందుంచారు. 
 
విచారణ తర్వాత శిక్ష ఖరారును 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. వీరిద్దరూ అమెరికాలో చట్ట విరుద్ధంగా నివశిస్తున్నట్టు ఇప్పటికే తేల్చిన పోలీసులు, శిక్ష అనుభవించిన తర్వాత, వారిని ఇండియాకు డిపోర్ట్ చేస్తామని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు