పువ్వులు-పండ్లు బుట్టతో ఎదురైనా వారి శకునం? మంచిదేనా?

బుధవారం, 11 జులై 2018 (14:40 IST)
ఏదైనా ఒక ముఖ్యమైన పనిమీద ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నప్పుడు శకునం చూసుకుని బయలుదేరుతుంటారు. కాస్త ఆలస్యమైనా మంచి శకునం చూసుకుని అడుగు బయటకు పెడతుంటారు. ఇలా మంచి శకునం చూసుకుని బయలుదేరడం వలన వెళ్లిన పని సఫలీకృతమవుతుందనే విశ్వాసం పూర్వకాలం నుండి ఉంది.
 
ఎవరికి వాళ్లు తాము తలపెట్టేకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తికావాలనే కోరుకుంటారు. అందుకే శకునానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని శకునాలు మంచివిగా మరికొన్ని శకునాలు అందకు విరుద్ధమైనవిగా చెప్పబడుతున్నాయి. కార్యసిద్ధిని కలిగించే శకునాలలో పువ్వులు, పండ్లు కనిపిస్తుంటాయి.
 
సాధారణంగా దైవదర్శనానికి వెళ్లాలని అనుకోగానే ముందుగా గుర్తుకువచ్చేది పువ్వులు, పండ్లే. భగవంతుడిని పువ్వులతో అలంకరిస్తుంటారు. దేవునికి వివిధరకాలైన పండ్లను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇక శుభకార్యలలోను పండ్లకి ప్రధానమైన స్థానం ఇవ్వబడుతుంది. ఇవి లేకుండా శుభకార్యమనేది జరగనే జరగదు. దీనిని బట్టి పువ్వులు, పండ్లు ఎంతటి శుభప్రదమైనవో అర్థంచేసుకోవచ్చు.
 
అందువలన పువ్వుల బుట్టతో గాని, పండ్ల బుట్టతో గాని ఎవరైనా ఎదురురావడం శుభసూచకంగా విశ్వసించడం జరుగుతోంది. పువ్వులతోను, పండ్లతోను కూడిన శకునం మంచిదిగా భావించి వెంటనే బయలుదేరవచ్చని స్పష్టం చేయబడుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు