ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి!

ఠాగూర్

ఆదివారం, 22 మార్చి 2026 (12:43 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్‌లు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం లేకుండా పోయింది. దీంతో జీవన్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25వ తేదీన ఆయన బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
దీనిపై బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అంటే తనకు చాలా గౌరవం ఉందని, ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే తాను వెళ్లి నా భుజాల మీద మోసుకుని వస్తానని అన్నారు. 
 
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని గత కొద్దిరోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడే విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. కానీ ఏ పార్టీలో చేరతారనే విషయం ఇంకా వెల్లడించలేదు. అయితే బీఆర్ఎస్‌లోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది.
 
ఈ నేపథ్యంలో సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జీవన్ రెడ్డి తమ పార్టీలోకి (బీఆర్ఎస్) వస్తానంటే సాదరంగా స్వాగతిస్తానని అన్నారు. ఆయన చాలా మంచి మనిషి అని, ఆయన అంటే తనకు గౌరవం ఉందని అన్నారు. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఒక్కసారి ఎమ్మెల్యే గెలవని వాళ్లు కూడా వచ్చి నలుగురు గన్‌మెన్లు కావాలని అడుగుతున్నారని, కానీ జీవన్ రెడ్డి మాత్రం అందుకు మినహాయింపు అని అన్నారు. ఆయన దగ్గర అవినీతి అనేదే లేదని అన్నారు. అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే సంతోషంగా స్వాగతిస్తానని వ్యాఖ్యానించారు. 
 
అయితే, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నారు. పైపెచ్చు జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో సంజయ్ కుమార్ జోక్యం చేసుకుంటున్నారని జీవన్ రెడ్డి కొంతకాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే ఆయన పార్టీని వీడాలని జీవన్ రెడ్డి కఠిన నిర్ణయం తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు