గడపపై తలపెట్టి పడుకుంటే... ఏం జరుగుతుందో తెలుసా?

మంగళవారం, 17 జులై 2018 (16:11 IST)
పూర్వం ఒక గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో చెప్పే సందర్భాల్లో ఇన్ని గడపలు ఉన్నాయని లెక్క తేల్చే వాళ్లు. అలాగే ఎవరైనా పేరంటానికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు లేకపోతే గడపకి బొట్టు పెట్టేసి వెళుతుంటారు. దీనిని బట్టి గడపకి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. గడపని శుభ్రంగా ఉంచుకోవాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతూ ఉండడం ప్రాచీనకాలం నుండి వస్తోంది.
 
అలాంటి గడపపై కూర్చున్నా, నుంచున్నా, దానిపై తలపెట్టి పడుకున్నా పెద్దలు తీవ్రమైన అసహానాన్ని వ్యక్తం చేస్తుంటారు. మరోసారి అలా చేయకూడదని మందలిస్తుంటారు. గడపకి అంతటి ప్రాముఖ్యతను ఇవ్వడానికి గల కారణమేమిటో ఈ కాలం పిల్లల్లో చాలామందికి తెలియదు. అందువలనే కొంతమంది గడప మీద కూర్చుని ఇతరులతో కబుర్లు చెబుతుంటారు.
 
కొంతమంది గడపను దాటకుండా దానిపై కాలుపెట్టి వెళుతుంటారు. ఒక్కోసారి అలా దానిపై నుంచుంటారు. ఇక మరి కొంతమంది గడపపై తలపెట్టి పడుకుని  పుస్తకాలు చదువుతూ ఉంటారు. అవసరమైతే అలాగే పడుకుంటారు. ఈ పద్ధతి ఎంతమాత్రం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. గడప శ్రీమన్నారాయణుడి స్థానం. నరసింహస్వామిగా ఆయన అక్కడ కూర్చునే హిరణ్యకశిపుడిని వధించడం జరిగింది.
 
నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. అందువలన గడప లక్ష్మీదేవి స్థానంగా కూడా చెప్పబడుతోంది. ఈ కారణంగానే గడపను పసుపు కుంకుమలతో అలంకరిస్తుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు