బాబా... ఈ ధనమంతా మీది అన్నాడు... సాయి అలాగా అంటూ...

మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (15:57 IST)
హరిసీతారాం దీక్షిత్ బొంబాయిలో సుప్రసిద్ద వకీలు. ఇతడు బాబా పట్ల అత్యంత భక్తిశ్రద్దలు కలిగి ఉండేవాడు. ఒకసారి ఒక సంస్థానాధీశుని కేసులో దీక్షిత్ విజయం సాధించాడు. అందుకు అతనికి ఒక ట్రంకు పెట్టె నిండా డబ్బు వచ్చింది. ఆ డబ్బు పెట్టెను తెచ్చి ద్వారకామాయిలోని సాయి పాదపద్మాల వద్ద ఉంచి బాబా... ఈ ధనమంతా మీది అన్నాడు. సాయి అలాగా.... అన్నారు.
 
ఆ పెట్టెను తెరచి అందులో ఉన్న సుమారు వెయ్యి రూపాయిలు డబ్బు అంతా దోసిళ్లలో అక్కడ ఉన్న వారికి పంచిపెట్టాడు సాయి. మిక్కిలి కష్టపడి సంపాదించిన ధనమునంతయు సాయి పంచిపెడుతున్నప్పుడు కాకాదీక్షిత్ ముఖంలో లేశమైనా విచారము గానీ, సంకోచము గానీ కన్పించలేదు.
 
సాయి కాంక్షించేది అదే.... అంతటి వైరాగ్యం, గురువుపై భక్తిభావము దీక్షిత్‌కు ఉన్నాయి. కనుకనే కాకాదీక్షిత్ భార్యతో సాయిబాబా అమ్మా... దీక్షిత్ విషయమై ఆందోళన పడవద్దు. నాది భారము అని అభయము ఇచ్చారు. సాయిబాబాయే దీక్షిత్ కుటుంబ బాధ్యతను వహించారు. ఏదైనా మనము భగవంతునికి సమర్పించిన తరువాత, అది నాది... నేను సమర్పించాను అన్న భావన ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒక్కసారి భగవంతునికి సమర్పించాక అంతా భగవంతుడే చూసుకుంటాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు