షిర్డీ సాయినాధుని మహిమ (Video)

గురువారం, 12 డిశెంబరు 2019 (21:43 IST)
యుగధర్మాన్ని కాపాడడంలో సామాన్య మానవుల రూపంలో సంచరిస్తూ ఉత్తమ కార్యాలతో ఆశ్రిత జనులకు సద్గతిని సంప్రాప్తింప చేయడంలో అటువంటి దైవ స్వరూపులు ముందుంటారు. అటువంటి పుణ్యపురుషులలో షిర్డీ సాయిబాబా ఒకరు. వారి బాల్యాన్ని గురించిన వివరాలు ఎవరికి తెలియవు. ఇప్పటికీ అత్యంత గోప్యంగానే ఉన్నది సద్గురు సాయినాధుని బాల్యం.
 
అద్భుతమైన తపస్సుతో సాధించిన ఆధ్యాత్మిక శక్తితో మహారాష్ట్రలోని షిర్డీ గ్రామంలో వాడవాడలా భక్తి భావనలను వ్యాపింపచేసి భక్తుల కొంగు బంగారమై నిలిచాడు షిర్డీ సాయినాధుడు. మతాలుకు అతీతంగా సర్వమత సామరస్యాన్ని చాటిచెప్పే రీతిలో తొలుత వృక్షం కింద తన ఆధ్యాత్మిక పరంపరను తదనంతరం పురాతనమైన మసీదులోకి నివాసాన్ని మార్చడం ద్వారా సాగించారు. ఆ మసీదునే ద్వారకామాయిగా పిలిచేవారు. సర్వకాల సర్వావస్థలయందు భక్తులకు సాయినాధుడు అందుబాటులో ఉండి వారి ఆపదలను తృటిలో తీర్చేవారు.
 
సాయి మహిమలు షిర్డీని దాటి ముంబై లాంటి మహా నగరాలకు వ్యాపించడంతో బాబా దర్శనం కోసం షిర్డీ చేరుకునే భక్తుల పెరిగింది. బాబా ఆధ్యాత్మిక భావ తరంగాలు దేశమంతా వ్యాపించాయి. నిరాడంబర జీవన విధానాన్ని సాగించే సాయినాధుడు, భక్తులు తనకు సమర్పించిన కానుకలను అన్నార్తులకు, పేదవారికి అందించేవారు. రోగగ్రస్థుల పట్ల అపారమైన కరుణను వారు ప్రదర్శించేవారు. 
 
ప్రస్తుతం మనం ఆచారిస్తున్న లౌకిక విధానానికి సాయి భగవానుడు ఆనాడే శ్రీకారం చుట్టారు. శ్రీసాయినాధుని ఆధ్వర్యంలో హిందు,ముస్లిం పండుగలు షిర్డీలో అత్యంత వైభవంగా జరిగిన దృష్టాంతాలు ఇందుకు నిదర్శనంగా నిలిస్తాయి. సాయి మహిమలు అపారం. దీపారాధనకై షిర్డీలోని వ్యాపారులు ద్వారకామాయికి  నూనెను సరఫరా చేయని సందర్భంలో నీటితో దీపాలు వెలిగించి వ్యాపారుల అహంకారాన్ని నిర్మూలించిన అవతారపురుషుడు శ్రీసాయి. సృష్టిలోని జీవుల పట్ల సమభావాన్ని పాటించమని ఆయన భక్తులకు ఉద్భోధించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు