కాణిపాకంలో పోటెత్తిన భక్తులు - సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (10:56 IST)
చిత్తూరు జిల్లాలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. బొజ్జలగణపయ్య దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల కోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీటితో పాటు ప్రసాదాలను అందిస్తున్నారు. 
 
గంటన్నరలోపే భక్తులకు స్వామిదర్శనం లభిస్తోంది. వినాయకచవితి పర్వదినం కావడంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ రకాల ఫల, పుష్పాలతో అందంగా ముస్తాబు చేశారు. మరోవైపు బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను దేవస్థానం ప్రారంభించనుంది. రేపు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 
 
25వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. రోజుకో వాహనంలో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవదాయశాఖ తరపున కాణిపాకం ఆలయానికి పట్టువస్త్రాలను దేవదాయశాఖామంత్రి దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు సమర్పించారు. 

వెబ్దునియా పై చదవండి