టోకెన్లు ఉంటేనే రథసప్తమి రోజు వాహనసేవలకు అనుమతి: టిటిడి ఈఓ

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (20:32 IST)
రథసప్తమి అంటే ఒక పండుగ. సప్తవాహనాలపై శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్సనమిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల్లో సాధారణంగా ప్రతిరోజు ఒక వాహన సేవను తిలకిస్తాము. అదే రథసప్తమిరోజు అయితే ఒకేరోజు అన్ని వాహనసేవలను తిలకించే అవకాశం ఉంటుంది.
 
ఇది ఎప్పటి నుంచో ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే కోవిడ్ కారణంగా ఈ యేడాది రథసప్తమి వాహనసేవలను తిలకించాలంటే భక్తులకు ఖచ్చితంగా టోకెన్లు ఉండాలి. టోకెన్లు అంటే దర్సనానికి సంబంధించిన టోకెన్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు టిటిడి ఈఓ జవహర్ రెడ్డి 
 
తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఫిబ్రవరి 19న సూర్యజయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి వేడుకగా నిర్వహిస్తామని.. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు చక్రస్నానం జరుగుతుందన్నారు. 
 
స్వామివారు ఒకేరోజు ఏడు ప్రధాన వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగడం వల్ల దీన్ని ఒకరోజు బ్రహ్మోత్సవాలని, ఉప బ్రహ్మోత్సవాలని పిలుస్తారని చెప్పారు. రథసప్తమి రోజు స్వామివారి దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు