పాతనోట్లు ఉంటే తిరుమల వెంకన్న స్వామిని కూడా అరెస్టు చేస్తారా?

శుక్రవారం, 21 జులై 2017 (11:05 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేసిన పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లు కలిగినవారిని అరెస్టు చేసేలా గతంలో ఆర్థికశాఖతో పాటు.. ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో తిరుమల తిరుపతి దేవస్థానం తరపు న్యాయవాది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  
 
తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉన్న సుమారు రూ.8.29 కోట్ల రద్దయిన పాత నోట్ల మొత్తాన్ని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై విచారణ జరుగుతున్న వేళ ఆసక్తికర వాదనలు సాగాయి. 
 
రద్దయిన రూ.1000, రూ.500 నోట్ల మార్పిడికి ఎన్నారైలు, జిల్లా సహకార బ్యాంకులకు అదనపు సమయం ఇచ్చి, టీటీడీకి ఇవ్వకపోవడం అన్యాయమని పిటిషనర్ రమణమూర్తి వాదించారు. రద్దయిన నోట్లు ఎవరి వద్దనైనా ఉంటే అది నేరమని, పాత నోట్లు ఉన్నందుకు వెంకటేశ్వర స్వామిని జైలుకు పంపుతారా? లేక టీటీడీని పంపుతారా? అని ఆయన ప్రశ్నించారు. 
 
ఈ నోట్లను అనుమతించకపోవడం వల్ల స్వామివారు భక్తులు సమర్పించిన కానుకలను అందుకోకుండా తిరస్కరించినట్టు అవుతుందని తెలిపారు. భక్తితో సమర్పించే కానుకలు స్వామివారికి, అభివృద్ధి పనులకు, భక్తుల సేవలకు వినియోగంకాకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని ఆయ కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు ఆలకించిన కోర్టు కేసు విచారణనను వాయిదావేసింది.

వెబ్దునియా పై చదవండి