అలిపిరి నడకమార్గం సుందరీకరణకు రూ.7.5 కోట్లు

గురువారం, 7 అక్టోబరు 2021 (21:05 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కోట్లాది మంది శ్రీవారి భక్తులు నడిచివెళ్లే అలిపిరి నడకమార్గాన్ని మరింతగా సుందరీకరించనుంది. ఇందుకోసం రూ.7.5 కోట్ల నిధులను కేటాయించింది. 
 
అలాగే, కడప జిల్లా రాయచోటిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. ఇకపోతే, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని జమ్మూలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదించారు.
 
తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల ఆరోగ్య నిధికి కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఆప్ కాస్ తరహాలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించారు. 
 
స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ నిర్మాణాలకు రూ.4.46 కోట్ల నిధులు కేటాయించారు. వరాహస్వామి విశ్రాంత భవనం-2లో మరమ్మతులకు రూ.2.61 కోట్లు మంజూరు చేశారు. వీటితోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా తితిదే పాలక మండలి ఆమోదం తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు